శాసన సభలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్
చెన్నై : డీఎంకే ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ప్రారంభమైన శాసన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా మరోసారి సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలను విభజించే ‘సనాతన ధర్మాన్ని’ నిర్మూలించాలని అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో, నటుడి నుండి నాయకుడిగా ఎదిగిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కూడా అక్కడ ఉన్నారు. ఇదే సమయంలో ‘విజయ్ ప్రభుత్వం’పై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. అన్ని ఇతర ప్రభుత్వ కార్యక్రమాల కంటే ముందే “తమిళ్ తాయ్ వాళ్తు” (తమిళ మాతృ గీతం) ఆలపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర గీతాన్ని మూడవ పాటగా ఆలపించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్లను అనుసరించడం ద్వారా రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలగకూడదని అన్నారు ఉదయనిధి స్టాలిన్. తమిళ గీతానికి ప్రథమ స్థానం దక్కేలా చూడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉదయనిధి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా స్పీకర్ ప్రభాకర్ ఆయనకు మాట్లాడేందుకు ఛాన్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ధన్యవాదాలు తెలిపారు.





