newsseals.com
News

ఆస్ట్రేలియా హైకమిషనర్‌తో సీఎం భేటీ

VijayaBhaskar May 14, 2026
newsseals-ChandraBabu
Spread the love

కీల‌క రంగాల‌లో స‌హ‌కారం పై చ‌ర్చ‌లు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస్ట్రేలియా హై క‌మిష‌న‌ర్ తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి కీల‌క రంగాల‌లో స‌హ‌కారంపై చ‌ర్చించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ-సాంకేతికత, లాజిస్టిక్స్, హరిత ఇంధనం, ఏరోస్పేస్ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వృద్ధి అవకాశాలను గుర్తించడంపై దృష్టి సారించారు. భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఓఏఎంతో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. బహుళ రంగాల సహకారంపై చర్చించారు. సమావేశం అనంతరం సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడారు.

అమరావతిలో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఓఏఎంను కలవడం ఆనందంగా ఉంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడంపై ఈ సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సామర్థ్యం పెరుగుతూనే ఉందని, దీనికి ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని ఫిలిప్ గ్రీన్ తన ఎక్స్ అకౌంట్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. ఏపీ సీఎంను మళ్లీ కలవడం, ఆస్ట్రేలియా-ఆంధ్రప్రదేశ్ సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో సీఎంకు నిరంతర విజయం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.