మీనాక్షి విష‌యంలో హైక‌మాండ్ సీరియ‌స్

VijayaBhaskar · June 15, 2026
Spread the love

ఎవ‌రు లీకు చేశార‌నే దానిపై విచార‌ణ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపింది. ఇదే అంశం ఆ పార్టీని క‌ల‌వ‌రానికి గురి చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఇక్క‌డి నుంచి ఆమెకు సంబంధించిన కేసు ఫైల్ ఎలా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎలా చేరింద‌ని, ఎవ‌రు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి అందేలా చేశారో తేలాల్సి ఉంద‌ని సీరియ‌స్ గా ఉంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ వెల్ల‌డించారు. ఓ టీవీ ఛాన‌ల్ తో జ‌రిగిన చిట్ చాట్ లో ఆయ‌న కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

మీనాక్షీ నటరాజన్ విషయంలో బీజేపీకి సమాచారం లీక్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. అధిష్టానం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుందని వెల్లడించారు. తనను కూడా ఇదే విష‌యం గురించి అధిష్టానం పెద్దలు కూడా విచారించారని తెలిపారు. విచిత్రం ఏమిటంటే ప్ర‌భుత్వం మీ చేతుల్లోనే ఉంద‌ని, దొంగ‌ను ప‌ట్టుకునేందుకు ఎందుకు ఆల‌స్యం చేస్తున్నార‌ని ప‌లువురు నిల‌దీస్తున్నారు. సీఎం ఆధ్వ‌ర్యంలోనే హోం శాఖ ఉండ‌డం గ‌మనార్హం.