హైదరాబాద్ : ప్రముఖ కార్టూనిస్ట్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో తనకు అత్యంత ఇష్టమైన నాయకులలో కేటీఆర్ ఒకరు అని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించి కూడా పంచుకున్నారు. ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. తను గనుక ఉద్యమాన్ని ముందుండి నడిపించక పోతే తెలంగాణ ఏర్పాటై ఉండేది కాదన్నారు. హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్టూనిస్ట్ శంకర్ మాట్లాడుతూ పై విధంగా ప్రశంసలు కురిపించారు. వృత్తి పరంగా తన అనుభవాన్ని పంచుకున్నారు.
2005లో ఒక ప్రదర్శన కార్యక్రమంలో కేసీఆర్ తన జుట్టుతో తెలంగాణ పటం కార్టూన్ను గీశారు శంకర్. ఆ సమయంలో కేసీఆర్కు రింగుల వంటి ఉంగరాల జుట్టుతో ఒక ప్రత్యేకమైన హెయిర్స్టైల్ ఉండేది .ఆ కార్యక్రమానికి కేసీఆర్, చిరంజీవి హాజరయ్యారు. తాను గీసిన కార్టూన్ను చూసి, వారు నన్ను భోజనానికి తమ ఇంటికి ఆహ్వానించారు. ఆయన కోపంతో పిలిచారేమోనని భయంతో వణికుతూ అక్కడికి వెళ్లానని చెప్పారు శంకర్. ఆయన అన్ని రకాల వంటకాలను సిద్ధం చేసి, కడుపు నిండా భోజనం వడ్డించారని గుర్తు చేశారు. ఆ తర్వాత, చిరంజీవి నేను గీసిన కార్టూన్ను చూసి ఏదో అడిగారు.. “ఏమిటి?” అని ఆయన అడిగారు. అప్పుడు నేను ఇలా అన్నాను. కేసీఆర్కు గుండు చేసినా తెలంగాణను తీసుకొస్తారు. అందుకే ఆయన తలపై తెలంగాణను గీశానని చెప్పానన్నారు. ఆ క్షణంలో, కేసీఆర్ నన్ను కౌగిలించుకున్నారు.. నా జీవితంలో జరిగిన అద్భుతం అది అన్నారు కార్టూనిస్ట్ శంకర్.





