తాడేపల్లిగూడెం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో
పొగాకు పండించిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మొత్తం పొగాకు ఉత్పత్తిలో కనీసం 10 శాతం కూడా సేకరించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దీనివల్ల రైతులు మధ్యవర్తులు , సిండికేట్ల దోపిడీకి గురయ్యే పరిస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్సీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. విజయవాడలో రైతుల బృందంతో సమావేశమైన సందర్భంగా, తాను రైతులకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని జగన్ హామీ ఇచ్చారు.
రైతులు గిట్టుబాటు ధరలు పొందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గోపాలపురం , జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో పర్యటిస్తానని ఆయన తెలిపారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించక పోతే, కందుకూరులో మరోసారి పర్యటించి, వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఇతర మంత్రులు కేవలం ప్రచారానికే పరిమితం అయ్యారు తప్పా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శ్రద్ద చూపడం లేదని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు జగన్ రెడ్డి.





