newsseals.com

జపాలి వద్ద నీరు తెల్లగా కనిపించడంపై అపోహలు వద్దు

July 25, 2026 · VijayaBhaskar

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఉన్న కొళాయిలలో నీరు తెల్లగా వస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ వివరణ ఇచ్చింది. వీడియోలో కనిపించినట్లుగా, కొళాయిలో నుంచి వచ్చిన నీరు కొన్ని సెకన్లలోనే సహజ స్థితికి చేరుకుని పారదర్శకంగా మారుతోంద‌ని తెలిపింది. అధిక వాటర్ ప్రెజర్ కారణంగా నీటిలో సూక్ష్మ గాలి బుడగలు ఏర్పడటం వల్ల నీరు తాత్కాలికంగా తెల్లగా కనిపిస్తోందని నిపుణులు తెలిపారు.

ఈ నీటిని తిరుమలలోని టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్‌లో పరీక్షించగా, నీరు పూర్తిగా స్వచ్ఛమైనదేనని నిర్ధారణ అయిందని పేర్కొంది టీటీడీ. నీటిలో ఎలాంటి దుర్వాసన, అడుగున అవశేషాలు (సెడిమెంట్) లేదా ఇతర మలినాలు లేవని ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్ నిపుణులు తెలిపారని పేర్కొంది. అందువల్ల భక్తులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అసత్య సమాచారాన్ని నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండ‌గా ఇలాంటి నిరాదారమైన వార్త‌ల‌ను ప్ర‌సారం చేసినా లేదా షేర్ చేసినా అటువంటి వ్య‌క్తుల‌ను గుర్తించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తీవ్రంగా హెచ్చ‌రించింది టీటీడీ.

Related News