విశాఖపట్నం జిల్లా : సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం వచ్చే భక్తులు పోలీసు సిబ్బందితో సహకరించాలని కోరారు మంత్రి వంగలపూడి అనిత. ఈనెల 28, 29వ తేదీలలో ఈ ప్రదక్షిణ జరగనుంది.
అప్పుఘర్, జోడుగుళ్లపాలెం వద్ద సముద్ర స్నానాలు చేసే భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హోం మంత్రి తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మూడు షిఫ్టుల్లో మొత్తం 90 మంది నిపుణులైన ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా భక్తులకు నిరంతరం భద్రతా సూచనలు చేస్తామని వివరించారు. భక్తుల రవాణా సౌకర్యార్థం ఈ నెల 28న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు హోం మంత్రి తెలిపారు.
29వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొండపై నుంచి దిగువకు, దిగువ నుంచి కొండపైకి ప్రత్యేక బస్సులు నడుస్తాయని చెప్పారు. 29వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండపై నుంచి దిగువకు భక్తులను తరలించేందుకు దేవస్థానం బస్సులతో పాటు 50 ఆర్టీసీ బస్సులను ఉచితంగా నడపనున్నట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలో నిరంతర వీధి దీపాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు, అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు అధికారుల సూచనలు పాటించి, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని హోం మంత్రి వంగలపూడి అనిత కోరారు. సముద్రంలో స్నానం చేసే భక్తులు జాగ్రత్తలు పాటించాలని, చిన్నారులు, వృద్ధుల విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భక్తులందరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన గిరి ప్రదక్షిణ అనుభవం కల్పించేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, దేవస్థానం, పోలీస్, జీవీఎంసీ, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
గిరి ప్రదక్షిణ మార్గం ప్రభావితమయ్యే గోపాలపట్నం, చినగదిలి, సీతమ్మధార, పెందుర్తి మండలాల పరిధిలోని మార్గానికి సమీపంలో ఉన్న 221 పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 28న స్థానిక సెలవు ప్రకటించినట్లు హోం మంత్రి తెలిపారు.







