తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహించే శ్రీవారి సహస్ర దీపాలంకార సేవ, అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో నిర్వహించే దాస సాహిత్య సంకీర్తనలను ఆలపించేందుకు ప్రతిభావంతులైన, అర్హులైన సంగీత కళాకారుల నుంచి టీటీడీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఆడిషన్లు 2026 నవంబరు 27 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు ఆరు రోజులపాటు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించబడనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే https://apps.tirumala.org/dsp/ ద్వారా ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అభ్యర్థుల అర్హతలు, ఆడిషన్ విధానం, సమర్పించాల్సిన ధ్రువపత్రాలు, మార్గదర్శకాలు, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని అడిషనల్ ఈవో తెలిపారు. ఈ ఆడిషన్ ప్రక్రియలో టీటీడీ ఎటువంటి ఏజెంట్లు, మధ్యవర్తులు లేదా ప్రతినిధులను నియమించలేదని స్పష్టం చేసింది. అభ్యర్థులు అనధికార వ్యక్తులను నమ్మకుండా, అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారానే దరఖాస్తులు సమర్పించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.







