అమరావతి : ఖరీఫ్–2026లో నోటిఫై చేసిన వరి మినహా అన్ని పంటలకు పంటల బీమా – పీఎంఎఫ్బీవై మరియు ఆర్డబ్ల్యూబీసీఐఎస్ కింద నమోదు చేసుకునే చివరి తేదీ 2026 జూలై 31 అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వరి పంటకు చివరి తేదీ 2026 ఆగస్టు 15 అని చెప్పారు. అర్హులైన రైతులు గరిష్ఠ సంఖ్యలో నమోదు అయ్యేలా సంబంధిత భాగస్వాములందరూ విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఖరీఫ్–2026 సీజన్లో రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి పరిస్థితులను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వర్షపాతం లోటు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం అందుబాటులో ఉండి, రైతులకు అవసరమైన సూచనలు, ప్రత్యామ్నాయ పంటలు, అత్యవసర విత్తనాలు, పంట రక్షణ చర్యలను సకాలంలో అందించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, డైరెక్టర్ మంజీర్ జిలాని, రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, 28 జిల్లాల డీఏవోలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు





