newsseals.com

డిప్యూటీ ఈవో లోక‌నాథం నివాసంలో ఏసీబీ రైడ్స్

September 2, 2026 · VijayaBhaskar

తిరుమ‌ల : ఏసీబీ దూకుడు పెంచింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) లో డిప్యూటీ ఈవోగా ప‌ని చేస్తున్న లోక‌నాథం నివాసంలో దాడులు చేప‌ట్టింది అవినీతి నిరోధ‌క శాఖ‌. గ‌త కొంత కాలంగా ఆయ‌న‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మెండు లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న లోకనాథం నివాసంలో ముమ్మర సోదాలు చేప‌ట్టారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్నాయి తనిఖీలు . లోక‌నాథంకు చెందిన ఐదు ప్రాంతాల‌లో ఏసీబీ దాడులు చేప‌ట్టింది. దీంతో ఒక్క‌సారిగా టీటీడీలో క‌ల‌క‌లం మొద‌లైంది.

తిరుప‌తి లోని త‌న నివాసంతో పాటు తిరుమ‌ల‌లో సైతం ఈ దాడులు కొన‌సాగిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా తిరుపతిలోని లోకనాథం ఇద్దరు బావ మరుదుల నివాసాల్లోనూ తనిఖీలు చేప‌ట్టారు. తిరుమలలోని లోకనాథం కార్యాలయం లోనూ ఏసీబీ సోదాలు జ‌రుపుతుండడంతో టీటీడీ కేంద్ర కార్యాల‌యంలో ప‌ని చేస్తున్న వారంతా అల‌ర్ట్ అయ్యారు. మ‌రో వైపు ఏర్పేడు మండలం చెల్లూరులోని లోకనాథం సోదరుడి ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ సోదాల్లో ఆస్తులు, నగదు, కీలక పత్రాలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలపై ఏసీబీ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి ఆరా తీస్తోంది.

Related News