హైదరాబాద్ : భారీ వర్షాలు కురుస్తుండడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, అన్ని శాఖల మధ్య సమన్వయం పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లో సంబంధిత అధికారులతో వర్ష పరిస్థితులపై సమీక్ష చేపట్టారు. హైదరాబాద్లో తెల్లవారు జామున కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, నగరవాసులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన సూచించారు. పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB), హైడ్రా (HYDRA), విద్యుత్, పోలీస్, రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నగరంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, అన్ని శాఖల మధ్య సమన్వయం పాటించాలని ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన లేదా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వికారాబాద్ , సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. హిమాయత్ సాగర్ , ఉస్మాన్ సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. పరివాహక ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాల వల్ల జలాశయాలు నిండిపోయే అవకాశం ఉందని, తద్వారా మూసీ నదిలోకి నీటిని విడుదల చేయడానికి గేట్లను ఎత్తాల్సి రావచ్చునని ప్రభాకర్ పేర్కొన్నారు.





