హైదరాబాద్ : సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గజల రామారం, కూకట్పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ , టోలీచౌకీ వంటి నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షం కురుస్తున్నప్పుడు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు , మెరుపుల వల్ల ప్రమాదం పొంచి ఉన్నందున, ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు , భారీ హోర్డింగ్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ముఖ్యంగా నీరు నిలిచిన రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షం వల్ల నీరు నిలిచే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది వాతావరణ శాఖ. తెలంగాణ , ఇతర రాష్ట్రాల్లో కూడా వర్షం, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.
వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రజలు వాతావరణ సమాచారాన్ని గమనిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడమైనది.





