ఆసియా కప్ విజేత భారత్ కు ప్రధాని కంగ్రాట్స్
న్యూఢిల్లీ : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక జట్టుపై భారత మహిళా జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 72 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ సందర్బంగా బీసీసీఐ అధ్యక్షుడితో పాటు భారత దేశానికి చెందిన ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా సాధించిన ఈ అద్భుత విజయం కోట్లాది మంది ప్రజలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. సోమవారం సోషల్ మీడియా వేదికగా పీఎం స్పందించారు. భారత క్రికెట్కు ఇది గర్వకారణం. ఆసియా కప్ గెలిచిన మహిళల జట్టుకు అభినందనలు అని పేర్కొన్నారు.
ఆసియా కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టును చూస్తే ఆనందంగా ఉందన్నారు పీఎం. ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతను మరింతగా ఆడి రాణించడానికి ప్రేరేపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టోర్నమెంట్ అంతటా క్రీడాకారుల ఆత్మవిశ్వాసం, వారి నిలకడ, అద్భుతమైన స్ఫూర్తి స్పష్టంగా కనిపించాయని ప్రధాన మంత్రి అన్నారు. మ్యాచ్ లో భాగంగా భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. అద్భుతంగా రాణించారు షఫాలీ వర్మ, స్మృతీ మందన్నా. దీంతో నిర్ణీత ఓవర్లలో 183 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందు ఉంచింది టీమిండియా. బౌలర్ల ధాటికి 113 పరుగులకే ప్రత్యర్థి జట్టు శ్రీలంక కుప్ప కూలింది. దీంతో 72 పరుగుల తేడాతో ఓడించింది టీమిండియా.