సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి
మంగళగిరి : ఏపీలోని మంగళగిరిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఘనంగా పూజలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తిపూర్వకంగా విఘ్నేశ్వరుడిని పూజించారు. కుటుంబ సమేతంగా జరిపిన ఈ గణనాథుని పూజ ఎంతో ఆధ్యాత్మిక తృప్తిని అందించింది అని ఈ సందర్బంగా తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన తన భార్య భువనేశ్వరితో పాటు మనవడు హిమాంషుతో కలిసి పూజలు నిర్వహించారు. గణపతి జ్ఞానం, విచక్షణ, విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయం. అడ్డంకులను తొలగించి, ధర్మ మార్గంలో నడిపించే ఈ చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను, ఐక్యతను , సమష్టి భావనను కలిగిస్తాయి అని తెలిపారు .
సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించేవి మన ఆధ్యాత్మిక కార్యక్రమాలే. వాటిలో, వివిధ పందిళ్లలో నిర్వహించే వినాయక చవితి వేడుకలు ఎంతో విశిష్టమైనవి. ఈ చవితి ఉత్సవాలు మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి శాశ్వత చిహ్నాలుగా నిలుస్తాయన్నారు నారా చంద్రబాబు నాయుడు. వినాయకుని ఆశీస్సులతో ప్రతి ఇల్లు సుఖ సంతోషాలు, సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరారు . రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ తొలగి పోవాలని, ఆంధ్రప్రదేశ్ సమృద్ధిగా అభివృద్ధి చెందాలని , తెలుగు ప్రజలు ఆనందంతో విరాజిల్లాలని ఆ గణనాథుడిని ప్రార్థించానని తెలిపారు సీఎం.