పీఆర్ఓ, పీఏలపై మూకుమ్మడి దాడి అప్రజాస్వామికం
న్యూఢిల్లీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న పోలీస్ స్టేషన్లో తన పీఆర్ఓ మహేష్ ముదిరాజ్ , పీఏ మహేందర్ రెడ్డిలపై జరిగిన దాడిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన కేసీఆర్ ఇంటిపై దాడి జరిగింది. ఆ దాడిని అడ్డుకోవడానికి మేము వెళ్ళినప్పుడు, వారు మమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించి, మాపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
నిన్న మళ్ళీ, పోలీస్ స్టేషన్ లోపలే 15 మందితో నా పీఆర్ఓ , పీఏలపై దాడి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని మండిపడ్డారు. దాడి చేయడానికి సాధారణ దుస్తుల్లో వచ్చిన వారు రౌడీలా? లేక పోలీసులా? అనేది తేలాల్సి ఉందన్నారు కేటీఆర్. మా వారిపై జరిగిన దాడికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినప్పటికీ, పోలీసులు పట్టించు కోలేదన్నారు. తెలంగాణలో పోలీస్ శాఖ ప్రజల కంటే కూడా కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఎక్కువగా పనిచేస్తోందన్నారు. ఈ విషయంపై తాము కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. కోర్టుల ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు కేటీఆర్.
ప్రభుత్వం తీవ్ర నిరాశ, నిస్సహాయతలో కూరుకు పోయిందన్నారు. వెయ్యి రోజులు గడిచినా, మేము లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రతిరోజూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు.