తిరుపతి : నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగగా రెండో రోజు రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ సౌమ్యనాథ స్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. భక్తుల గోవింద నామస్మరణ, చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన వాహన సేవ ఆధ్యాత్మిక పరవశాన్ని నింపింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేసింది.
హంస వాహన సేవలో శ్రీ సౌమ్యనాథ స్వామివారు జ్ఞాన మూర్తిగా ప్రకాశిస్తాడు. భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. అదేవిధంగా జూలై 24వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు పల్లకీ ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించారు, రాత్రి 7 గంటలకు సింహ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ వాహనసేవలో ఆలయ ఏఈవో రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







