తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్వో జనార్థన్ పెరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 38 మంది అధికారులు, 281 మంది ఉద్యోగులకు, స్విమ్స్లో 6 మంది, ఎస్వీబీసీలో 6 మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసా పత్రం అందజేశారు.
అదేవిధంగా ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఇంటర్లో ప్రతిభ కనబరిచిన 33 మంది విద్యార్థులకు 4,116/-, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 29 మంది విద్యార్థులకు 2,116/- నగదు బహుమతులు అందజేశారు. ఇదిలా ఉండగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు “ఏ దేశమేగినా ఎందు కాలెడినా…..”, “ భవతు భారతి…”, “ అదివో అల్లదివో…” తదితర దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. వీరిని ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవో డాక్టర్ ఎ. శరత్.








