ఆకట్టుకున్న సంకీర్తనల గోష్ఠిగానం
తిరుపతి : శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది. ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. ఇందులో ”బ్రహ్మకడిగిన పాదము…., శరణంటూ…, హరి అవతారమితడు అన్నమయ్య.., శరణు శరణు…” కీర్తనలను కళాకారులు ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు.
ధ్యాన మందిరంలో అన్నమయ్య విగ్రహానికి అభిషేకం జరిగింది. అభిషేకంలో భాగంగా అన్నమయ్య విగ్రహానికి జలంతో శుద్ధి గావించి పాలు, పెరుగు, తేనె, పంచదార, టెంకాయ, నీరు, పసుపు, గంధం, సుగంధ, పరిమళ ద్రవ్యాలతో అర్చక వేద మంత్రోత్సవాల నడుమ అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నమయ్య విగ్రహానికి పట్టు వస్త్రాలు, పుష్పమాలతో అలంకరించి ధూప దీప నివేదన కర్పూర హారతి అన్నమయ్య భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నగర సంకీర్తనలో పాల్గొని గోష్టి గానం నిర్వహించారు. ఉదయం 8 నుండి 11 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం చేపట్టారు.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత సభ, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు హరికథ గానం చేపట్టారు.








