కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీ డీన్ ఆచార్య రామనాథం
తిరుపతి : అన్నమయ్య, పురంధర దాసుల సంకీర్తనలు భక్తి, నైతిక విలువలు, సమానత్వ భావనలను ప్రజల్లో విస్తరించాయని, నామ సంకీర్తన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని అన్నారు మైసూరు కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ డీన్ ఆచార్య రామనాథం నాయుడు. “అన్నమయ్య- పురంధర దాస సంకీర్తన సౌరభం ” అనే అంశంపై మాట్లాడారు. భాష, ప్రాంత భేదాలు లేకుండా భక్తి మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ మహనీయుల సందేశాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.
తరువాత పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఈశ్వర్ బాబు ”అన్నమయ్య ఆలోచన ఆవశ్యకత” అనే అంశంపై మాట్లాడారు. అన్నమయ్య సమాజం కోసం ప్రతి కీర్తనలో సందేశం అందించారన్నారు. సమాజాన్ని బాగు చేయడం, ప్రజల్లో భక్తి చైతన్యం తీసుకు రావడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. శరణాగతి తత్వాన్ని వైరాగ్యాన్ని తెలుసు కోవాలని ప్రబోధించినట్లు తెలియ జేశారు. అన్నమయ్య వాగ్గేయకారులకు, కవులకు భాషా సందేశం, కీర్తనలు, కీర్తన అంశాల విధాన సందేశం, తాత్విక, సంగీత సందేశం ఇచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు లత ఇతర అధికారులు పుర ప్రజలు పాల్గొన్నారు.







