శ్రీవారి చిత్రపటం, ప్రసాదం అందజేసిన చైర్మన్
తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన వెంట ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, భార్య నారా భువనేశ్వరి, మనవడు నారా దేవాన్ష్ ఉన్నారు. ప్రోటోకాల్ ఉన్నప్పటికీ ఆయన సామాన్యుడిలాగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ జన్మదినం సందర్భంగా శ్రీవారి సేవలో పాల్గొని ఆశీస్సులు పొందారు.
ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు స్వాగతం పలికి దర్శనం కల్పించగా, అనంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటం, పంచాంగం, ప్రసాదాలను అందజేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈవో ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు వి. వీరబ్రహ్మం, డాక్టర్ ఎ. శరత్ ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు బోర్డు సభ్యులు కూడా హాజరయ్యారు.





