కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఐఎస్బీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గతంలో జగన్ రెడ్డి పాలనా కాలంలో ఏపీ సర్వ నాశనం అయ్యిందన్నారు. కానీ కూటమి సర్కార్ కొలువు తీరాక అన్ని వ్యవస్థలను గాడిన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా లాంటివి విద్యుత్ రంగాన్ని శాసిస్తాయన్నారు. సుస్థిర విద్యుత్ ఉత్పాదనతో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచాల్సిన అవసరం రాబోదన్నారు సీఎం.
ఇంధనాలు, విద్యుత్ లాంటి వాటి వ్యయం ఎంత తక్కువకు ఇస్తాం అన్నదే ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారిందన్నారు . ప్రస్తుతం యుద్ధ ప్రభావం ప్రపంచం అంతా పడిందన్నారు. ఎల్పీజీ కొరత నేపథ్యంలో పీఎన్జీ కీలకంగా మారిందని చెప్పారు చంద్రబాబు. దక్షిణ భారత్ లోనే గ్రీన్ ఇంధన తయారీలో ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శనాల ఎఫీషియన్సీని 15-20 శాతం పెంచగలిగాం అని చెప్పారు. ఆధునిక ల్యాబ్ ద్వారా ప్రసాదం తయారీలో వినియోగించే పదార్ధాలను కూడా నిత్యం పరీక్షిస్తున్నాం అని తెలిపారు. గతంలో లా ఇప్పుడు కల్తీ నెయ్యి వాడేందుకు ఆస్కారం ఉండబోదన్నారు.








