ఆయన ఆరోగ్య పరంగా త్వరగా కోలుకోవాలి
అమరావతి : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల ఈ మధ్యన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నీరసంగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తక్షణమే తనకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఇంకొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు వైద్యులు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాజ మహేంద్రవరం లోని ఆనం కళా కేంద్రం ప్రాంగణంలో నగర జనసేన అధ్యక్షులు ఎన్నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన రుద్ర ఏకాదశిని సహిత మహా మృత్యుంజయ పాశుపత హోమంలో పాల్గొన్నారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకందరికీ మార్గదర్శి అని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం కేవలం మాకే కాదు, దేశానికే ఎంతో ముఖ్యమైనదని అన్నారు కందుల దుర్గేష్. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి, త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజల కోసం పదేళ్ల పాటు అకుంఠిత దీక్షతో పోరాడి జనసేన పార్టీని స్థాపించి, ఈరోజు అధికారంలోకి తీసుకు వచ్చిన మహా నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఆయన క్షేమం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా పూజలు నిర్వహిస్తున్న జనసేన శ్రేణులకు హృదయ పూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియ చేశారు.






