ఏప్రిల్ 27వ తేదీన రథోత్సవం నిర్వహణ
తిరుపతి : నారాయణవనం శ్రీ మరగదవల్లీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 22న సింహ వాహనంపై దర్శనం ఇచ్చారు. 23న హంస వాహనం, 24న శేష వాహనం, 25న నంది వాహనం, 26న గజ వాహనం, 27న రథోత్సవం చేపట్టనున్నారు.
ఏప్రిల్ 28న రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించి, అనంతరం అశ్వవాహన సేవ ఉంటుంది. రూ.500 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్న ప్రసాదం అందజేస్తారు. ఏప్రిల్ 29న ఉదయం 9 గంటలకు శ్రీ నటరాజ స్వామివారి వీధి ఉత్సవం జరుగనుంది. సాయంత్రం రావణాసుర వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. 30న కైలాసకోనలో త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించి, అదేరోజు రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల మధ్య ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం, రాత్రి 7.30 గంటలకు వాహనసేవ నిర్వహించనున్నారు.







