కీలక వ్యాఖ్యలు చేసిన డా. చక్రవర్తి రంగనాథన్
తిరుపతి : శ్రీ రామానుజాచార్యుల గ్రంథాలు ఆధ్యాత్మికత, తాత్వికతతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని డా. చక్రవర్తి రంగనాథన్ కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్తానం పాలకమండలి (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో మూడు రోజుల పాటు అవతార మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామానుజాచార్యులు భక్తి మార్గాన్ని ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకు వచ్చిన మహానుభావుడని ప్రశంసించారు. ఆయన బోధనలు దేశ వ్యాప్తంగా విస్తరించాయని తెలిపారు.
ఇదిలా ఉండగా శ్రీ రామానుజాచార్యులు చేసిన కృషి వల్లనే ఇవాళ తిరుమల పుణ్య క్షేత్రం ప్రసిద్ది చెందిందని పేర్కొన్నారు చక్రవర్తి రంగనాథన్. హిందూ ధర్మంలో ప్రముఖ తత్వవేత్తగా, భక్తి ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. ఆయన ప్రవచించిన విశిష్టాద్వైతం (Vishishtadvaita) అనే తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. భక్తి ద్వారా మోక్షం సాధ్యమేనని, ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గర సమానమేనని పేర్కొన్నారన్నారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సమానత్వం ఉండాలని ఆకాంక్షించారని అన్నారు . ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని అందరికీ అందించారని చెప్పారు.






