నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరుతో అడ్డగోలు దందాకు తెర లేపారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. గాంధీ కుటుంబానికి ఇస్తానన్న రూ.1000 కోట్లు నీ అయ్య సొమ్మా? నీ అబ్బ సొత్తా అంటూ నిప్పులు చెరిగారు. గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ఇవ్వడానికే రూ.1000 కోట్లు ఉంటే, మరి ఆయన ఎన్నికోట్లు దోచుకొని దాచుకున్నాడో ప్రజలు ఆలోచించాలని కోరారు . కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో రైతుబంధు పడేదని అని, కానీ ఇప్పుడు మార్చి వస్తున్నా రైతుబంధు ఇవ్వడం లేదంటూ ధ్వజమెత్తారు. అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన సర్కార్ పూర్తిగా మాట మార్చడం దారుణమన్నారు. రైతులకు యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు, రైతుల దగ్గర పంటలు కొనే సోయి లేదు.. కానీ గాంధీ కుటుంబానికి వేయి కోట్లు ఇస్తానని చెప్పడం పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేటీఆర్.







