newsseals.com
DEVOTIONAL

రాములోరి స‌న్నిధిలో మంత్రి నారా లోకేష్‌

VijayaBhaskar March 25, 2026
newsseals-LokeshNara
Spread the love

పునః ప్ర‌తిష్ట మ‌హోత్స‌వంలో పాల్గొని పూజ‌లు

అమ‌రావ‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధ‌వారం తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణం కొప్పురావుకాలనీలో నూతనంగా రామాలయ పున:ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య హనుమత్ లక్ష్మణ సీతాసమేత రాముల వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు.

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం స్వామి వార్లను దర్శించుకుని మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం పునర్ నిర్మాణానికి మంత్రి లోకేష్ రూ.5 లక్షల విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఈ శుభ స‌మ‌యంలో పునః ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం తాను అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్రాన్ని ఎకో, టెంపుల్ టూరిజానికి కేంద్రంగా మారుస్తామ‌న్నారు.