82 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ విక్టరీ
అహ్మదాబాద్ : ఆశిష్ నెహ్రా మార్గదర్శకత్వంలో గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపుతోంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటుతూ ప్రత్యర్థి జట్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక పోరులో బలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చుక్కలు చూపించింది. ఏకంగా 82 పరుగుల భారీ తేడాతో ఓడించింది. పాయింట్ల పట్టికలో టాప్ కు చేరుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది గుజరాత్ టైటాన్స్. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా ఎక్కడా తొణకలేదు గుజరాత్ బ్యాటర్లు. ప్రధానంగా ఈ టోర్నీలో సత్తా చాటుతూ వస్తున్నాడు సాయి సుదర్శన్. తను మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తనకు తోడుగా నిలిచాడు వాషింగ్టన్ సుందర్.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 168 పరుగులు చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు 14.5 ఓవర్లలోనే చాప చుట్టేసింది. 86 రన్స్ కే ఆలౌటైంది. కమిన్స్ ఒక్కడే 19 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లు కగిసో రబాడా 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా జేసన్ హోల్డర్ 20 రన్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. ఇక సాయి సుదర్శన్ 44 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 61 రన్స్ చేశాడు. సుందర్ 33 బంతులు ఎదుర్కొని 50 రన్స్ చేశాడు. 7 ఫోర్లు 1 సిక్స్ కొట్టాడు.







