అమరావతి : టెక్నాలజీ పెరిగినా నేరాలు ఆగడం లేదు. టెక్నాలజీలోని లొసుగులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు , హ్యాకర్స్ రెచ్చి పోతున్నారు. ఓ వైపు బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తూ ఇబ్బందులు గురి చేస్తుండగా మరో వైపు సోషల్ మీడియాలోని ప్రముఖుల ఖాతాలను స్తంభింప చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రేదశ్ రాష్ట్రానికి చెందిన హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశారు సైబర్ ఆగంతకులు. తన ఖాతా నిలిచి పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. ఈ మేరకు తక్షణమే తన ఎక్స్ ఖాతా హ్యాక్ అయ్యిందని గుర్తించిన ఆమె స్వయంగా
అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణతో మాట్లాడారు హోంమంత్రి అనిత. ఉద్దేశ పూర్వకంగానే హ్యాక్ చేశారని భావిస్తున్నారు పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇదిలా ఉండగా అధికారికంగా కీలక ప్రకటన చేశారు హోం శాఖ మంత్రి. అనుమానాస్పద పోస్ట్లతో స్పందించ వద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. హ్యాక్ అయిన ఆ ఖాతా నుండి వచ్చే పోస్ట్లను నమ్మవద్దని లేదా వాటితో ఎలాంటి స్పందన (engagement) చూపవద్దని ప్రజలను కోరారు. ఆ ఖాతాపై నియంత్రణను తిరిగి పొందేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ఐజీ రవికృష్ణ.





