హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ నివేదికలు చార్జిషీట్లకు వెన్నెముకగా ఉంటాయని పేర్కొన్నారు. విచారణ సమయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని అన్నారు. సాక్ష్యాలను సరిగ్గా సేకరించి, విశ్లేషించి, కోర్టులో సమర్పించక పోతే, క్షుణ్ణంగా పోలీసులు పని చేసినప్పటికీ నేరస్థులు శిక్ష నుండి తప్పించుకునే ప్రమాదం ఉందన్నారు . హైదరాబాద్లోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL)లో కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాన్ని అందజేశారు. మనం ఒక నేరాన్ని ఎంత క్షుణ్ణంగా దర్యాప్తు చేసినా, బలమైన శాస్త్రీయ సాక్ష్యాలు , నాణ్యమైన ఫోరెన్సిక్ నివేదికలు లేకుండా కేసు కోర్టులో విఫలం కావచ్చు అని పేర్కొన్నారు.
శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత దర్యాప్తునకు అధిక ప్రాధాన్యతనిచ్చే కొత్త క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా తమ సామర్థ్యాలను మెరుగు పరుచుకోవాలని డీజీపీ సూచించారు. కోర్టు విధి విధానాలు, సాక్ష్యాల నిర్వహణ, డాక్యుమెంటేషన్పై బలమైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. అత్యున్నత స్థాయి కచ్చితత్వం, శాస్త్రీయ సమగ్రత ప్రమాణాలను పాటించాలని ఏవీ ఆనంద్ సలహా ఇచ్చారు. కొత్తగా నియమితులైన 57 మంది శాస్త్రీయ సిబ్బంది చేరికతో తెలంగాణ టీజీఎఫ్ఎస్ఎల్కు దాని శాస్త్రీయ మానవ వనరులలో గణనీయమైన బలం చేకూరిందన్నారు. . హోం శాఖ ముఖ్య కార్యదర్శి, ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కొత్తగా నియమితులైన సిబ్బందిని స్వాగతించారు. టీజీఎఫ్ఎస్ఎల్ పనితీరు, సామర్థ్యాలు, విజయాల గురించి వివరించారు.





