హైదరాబాద్ : బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్పందించారు. ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డికి చెంప పెట్టు లాంటిదన్నారు. హిట్లర్ వారసుడినని చెప్పుకునే రేవంత్ రెడ్డికి కూడా హిట్లర్ గతే పడుతుందన్నారు. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు తమ ఇష్టాయిష్టాల ప్రకారం కాకుండా, చట్టం ప్రకారం పని చేయాల్సి ఉంటుందన్నారు. ఇవాళ హైడ్రా పేరుతో కమిషనర్ గా ఉన్న ఏవీ రంగనాథ్ నానా హంగామా సృష్టించడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేశాడని మండిపడ్డారు. హైడ్రా రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం చేసిందని వాపోయారు.
అహంకారం తారాస్థాయికి చేరింది, స్వయంగా ముఖ్యమంత్రే “నేను హిట్లర్ వారసుడిని” అని ప్రకటించుకున్నారు. హిట్లర్ హయాంలో ఉన్న ప్రధాన కమిటీ పేరు హైడ్రా. అధికారాలతో ఎవరినైనా, ఎలాంటి హక్కులతో సంబంధం లేకుండా చంపేసే అవకాశం ఉండేదన్నారు. వేలమందిని పొట్టనబెట్టుకున్న హిట్లర్ నుండి స్ఫూర్తి పొంది, దీనికి హైడ్్రా అని పేరు పెట్టానని ముఖ్యమంత్రే స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు ఈటెల రాజేందర్. ఈ ప్రభుత్వానికి కూడా హిట్లర్ గతే పడుతుందని తెలంగాణ ప్రజలు శపిస్తున్నారని అన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత ఆక్రమణదారుల చేతిలో ఉన్న భూములు విముక్తి అవుతాయని, చెరువులు, కాలువలు రక్షించ బడతాయని అందరూ భావించారని అన్నారు. పేదల పాలిట శాపంగా పెద్దోళ్లకు మేలు చేకూర్చేలా ఇప్పటి వరకు పని చేసిందన్నారు.





