న్యూఢిల్లీ: పంజాబ్ పాఠశాల విద్యా బోర్డుకు సంబంధించి కొనసాగుతున్న వివాదంపై పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జ్యోత్ సింగ్ బేన్స్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి చెందిన పార్లమెంట్ సభ్యులు మంగళవారం పార్లమెంట్ భవనం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్, ఎంపీ సుష్మితా దేవ్ సహా పలువురు ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. వీరిద్దరూ ఒకప్పుడు ప్రతిపక్షంలో ప్రముఖ నాయకులుగా ఉండి, ఇప్పుడు ఎన్డీఏలో భాగమయ్యారు. గతంలో ఈ ఇద్దరూ అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరు ఉన్నట్టుండి ఎవరికీ చెప్పకుండానే చెక్కేశారు.
బీజేపీ ఆశలకు లోనైన వీరు రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఆపై కాషాయ జెండా కప్పుకున్నారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ, ఎంపీలు జవాబుదారీతనం కోసం పిలుపునిచ్చారు. హర్జ్యోత్ సింగ్ బేన్స్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ ప్రదర్శన, అన్ని పార్టీల సభ్యుల దృష్టిని ఆకర్షించింది. ఈ నిరసనపై గానీ, రాజీనామా డిమాండ్పై గానీ పంజాబ్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించ లేదు.





