శ్రీవారి ఆలయంలో పూజల నిర్వహణ
తిరుమల : ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. ఇదిలా ఉండగా ఉడుపిలోని శ్రీ పుత్తిగే మఠం పీఠాధిపతి, పరమ పూజ్య శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామిజీ బుధవారం తన శిష్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతకు ముందు, ఆలయ ప్రధాన ద్వారం వద్దకు స్వామిజీ విచ్చేసినప్పుడు, వేద పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ పేష్కార్ రామకృష్ణ ఆయనను సాదరంగా ఆహ్వానించారు.
పోటు పేష్కార్ మునిరత్నం, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలకమైన సమావేశం నిర్వహించింది. ఇందులో ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, జేఈవో (విద్య, వైద్యం) డాక్టర్ ఎ. శరత్ తో పాటు టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని దేవాలయాలలో ధూప, దీప, నైవేద్యాలకు సంబంధించి శుభవార్త చెప్పింది పాలకమండలి. ఈ మేరకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.







