నిధులు మంజూరు చేయక పోతే ఎలా..?
నిజామాబాద్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వంత సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నిధులు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఇదేం ప్రభుత్వం అంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. సోమవారం ఆయన పలుమార్లు ఫోన్ చేశారు. అయినా స్పందించక పోవడం పట్ల మండిపడ్డారు. నేను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాలు మొక్కాల్నా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.
మంత్రికి 20 సార్లు చెప్పానని, నిధులు మంజూరు చేయాలని అయినా పట్టించు కోలేదని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయన్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పిండని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదన్నారు. ప్రభుత్వం అనేది ఉందా ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోందన్నారు .















