స్పష్టం చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు
తిరుపతి : ధర్మ బద్ధమైన జీవన విధానం ద్వారా వ్యక్తిగత శాంతి, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు. ప్రతి ఒక్కరూ సత్యం, దయ, క్షమ వంటి విలువలను ఆచరిస్తూ జీవించడమే నిజమైన భగవద్భక్తి అని పిలుపునిచ్చారు. చాగంటి వారి ఉపన్యాసాన్ని వినేందుకు విచ్చేసిన భక్తులతో మహతి కళాక్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆయన అందించిన ఆధ్యాత్మిక సందేశాలు శ్రోతలను ఆలోచనలో ముంచెత్తి, భక్తి భావాన్ని పెంపొందించాయి.
సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు చాగంటి కోటేశ్వర్ రావు. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాల సారాంశాన్ని ప్రజలకు సులభంగా అందిస్తూ విలువలను పెంపొందించాలని చెప్పారు. టీటీడీ భక్తులకు నిరంతర సేవలు అందిస్తూ, ప్రతి రోజూ ఎందరో భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారని ప్రశంసించారు. భక్తుల సేవే – భగవంతుడి సేవ అనే భావంతో పనిచేస్తున్న టీటీడీ ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ని టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో ( వైద్యం, విద్య) డా.ఎ.శరత్, సివిఎస్వో కేవీ మురళీకృష్ణ ఘనంగా సత్కరించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ,సిపిఆర్ఓ డాక్టర్ టి. రవి, డిపిపి అదనపు కార్యదర్శి కళ్యాణి, డిప్యూటీ ఈవోలు గోవింద రాజన్, ఆనందరాజు, పలువురు అధికారులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





