దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం
విశాఖపట్నం జిల్లా : విశాఖ జిల్లాలోని పేరు పొందిన సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి చందనోత్సవం ఇవాళ అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గత ఏడాది లక్షా 25 వేల మంది భక్తులు దర్శించు కోగా ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శనాలు సాఫీగా జరిగేలా అధికారులు, పోలీసులకు దిశానిర్దేశం చేశాం అని స్పష్టం చేశారు మంత్రి అనిత వంగలపూడి.
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మంచినీరు, మజ్జిగ పంపిణీతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని స్పస్టం చేశారు. అత్యవసర సమయాల్లో సహాయం కోసం NDRF/SDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు అనిత వంగలపూడి. ఏఐ (AI) టెక్నాలజీ, సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, తెల్లవారుజామున 3 గంటల నుండే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడం జరిగిందన్నారు.






