రూ. 44 లక్షలు ఇచ్చిన భాష్యం విద్యా సంస్థలు
తిరుమల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఏప్రిల్ 20. ఆయన బర్త్ డే సందర్బంగా ఇవాళ తిరుమలలోని అన్న ప్రసాదానికి రూ.44 లక్షల విరాళం ఇచ్చారు ప్రముఖ విద్యాసంస్థ భాష్యం. గుంటూరుకు చెందిన భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బి. రామకృష్ణ తిరుమలలో ఒక్కరోజు శ్రీ వారి అన్నప్రసాద వితరణ కోసం భారీ విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, టీటీడీ అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్రకు విరాళం డిడిని దాత అందజేశారు. టీటీడీ అధికారులు మాట్లాడుతూ, తిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద సేవకు దాతల సహకారం ఎంతో ప్రాధాన్యమైందని తెలిపారు. భక్తుల సేవలో భాగంగా ఇటువంటి దాతృత్వం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.






