
ఉత్సవాల దేవునికి ఉత్సవాలే ఉత్సవాలు
తిరుమల : స్మరణా త్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్ అని స్వామిని తలంచిన అన్ని పాపాలు హరించ బడుతాయి, కోరికలు ఈరేడుతాయి, ముక్తి సంప్రాప్తిస్తుంది అన్నది శ్రీవారి భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తజన ప్రియుడు, ఆశ్రిత కల్పతరువు, కోరిన వరాలిచ్చే కోనేటి రాయుడైన శ్రీ వేంకటేశుడు వెలసివున్న తిరుమల దివ్య క్షేత్రంలో అన్నీ అద్భుతాలే.
నిత్య కల్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధి గాంచిన వేంకటాచలంలో ప్రతిరోజూ ఉత్సవమే. సుప్రభాతం, తోమాల, సహస్ర నామార్చన వంటి నిత్యోత్సవాలు, అష్టదళ పాద పద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం వంటి నక్షత్రోత్సవాలు, కోయిలాళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం, తెప్పోత్సవం, పద్మావతి పరిణయం, జేష్ఠాభిషేకం, ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం వంటి సంవత్సరోత్సవాలతో ప్రతిరోజూ ఒక పండుగగా, ప్రతిపూటా పరమాన్నభరిత నివేదనలతో, ఏడు కొండలవాడు ఏడాది పొడవునా పూజలందుకుంటూ ఉత్సవాల దేవునిగా, ఆరాధింప బడుతున్నాడు.
సంవత్సరానికి ఉన్నవి 365 రోజులే కాని కొండలరాయునికి ఉత్సవాలు 450 కి పైమాటే అంటే అతిశ యోక్తిలేదు. అలంకార ప్రియుడైన శ్రీహరి వైభవాన్ని తిలకింప వేయికన్నులైనా చాలవు. స్వామివారి ఉత్సవ మూర్తియైన శ్రీ మలయప్ప తన ఉభయ దేవేరులైన శ్రీభూదేవీలతో కూడి సర్వాంగ సుందరంగా అలంకృతుడై తిరు ఉత్సవాలలో పాల్గొంటూ తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు.
10వ శతాబ్దంలో పల్లవరాణి స్వామ వాయి కాలంలో తిరుమల శ్రీవారికి ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. ఆ కాలంలో పెరటాసి, మాఘ మాసాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించే వారు. 13వ శతాబ్దం వరకు ఈ సాంప్రదాయం కొనసాగింది.
అనంతరం వీర నరసింహ యాదవ రాయలు భార్య ఆడి నెలలో మూడో బ్రహ్మోత్సవం ప్రారంభించినట్లు తెలుస్తోంది. 14వ శతాబ్దంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుక్కొడి తిరునాళ్ అని సంభోదించే వారట. ఈ శతాబ్దంలో సంవత్సరానికి మూడుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించే వారు. తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు, తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో ఒక బ్రహ్మోత్సవాలు జరిగేవి.
16 శతాబ్దం నాటికి వైశాఖం, ఆడి మాసాల్లో మినహా నెలకు ఒక్కటి చొప్పున బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. వైశాఖం, ఆడి మాసాల్లో తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఆరోజుల్లో అంకురార్పణతో కలిపి మొత్తం 12 రోజులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగేవి.
గత కొన్ని శతాబ్దాల క్రితం వరకు సంవత్సరంలో నాలుగుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. పెరటాసి, రథ సప్తమి, కైశిక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సమయాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.