ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిఖంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా సెమీ ఫైనల్ లో గెలవడం మామూలు విషయం కాదన్నాడు. ప్రధానంగా ఇద్దరు ఆటగాళ్లు కీలకమైన పాత్ర పోషించారని చెప్పాడు. ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు స్పీడ్ స్టర్ బౌలర్ గా పేరు పొందిన జస్ప్రీత్ బుమ్రా మరొకరు కేరళ సూపర్ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ అని పేర్కొన్నాడు. శనివారం కపిల్ దేవ్ మీడియాతో మాట్లాడాడు. ఇది క్రికెట్ ఆటకు లభించిన విజయం అని పేర్కొన్నాడు కపిల్ దేవ్. అతను (జస్ప్రీత్ బుమ్రా) ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్ అని నేను భావిస్తున్నానని చెప్పాడు.
ఒత్తిడిలో అతను ఎలా రాణిస్తాడో చూస్తే, అతను గౌరవానికి అర్హుడని పేర్కొన్నాడు . గత రెండు మ్యాచ్ లలో ఎవరూ ఊహించని రీతిలో తన అద్బుతమైన ఆట తీరును ప్రదర్శించాడంటూ సంజు శాంసన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు కపిల్ దేవ్. తను ఆడిన షాట్స్ తనను కూడా ఆశ్చర్యాన్ని కలిగించేలా చేశాయని తెలిపాడు. ఇంకా విజయానికి కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నామని, చివరి మ్యాచ్ మిగిలి ఉందన్నాడు కపిల్ దేవ్. అవును, వ్యక్తులు ముఖ్యం, కానీ ఒక జట్టు ఆడినప్పుడు, మీరు విజయాన్ని చూస్తారని పేర్కొన్నాడు.





