పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమం
హైదరాబాద్ : సమాజం కోసం నిరంతరం సేవలు అందిస్తున్న వారిలో పోలీసుల పాత్ర కీలకమైనదని ప్రశంసలు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మొదట సహాయం కోసం ఎదురు చూసేది పోలీసుల కోసమేనని చెప్పారు. ఒకప్పుడు తీవ్రవాదం ఒక సమస్యగా ఉండేదన్నారు. దానిని ఎదుర్కోవడానికి ఆక్టోపస్, గ్రేహౌండ్స్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చాం అన్నారు. అవినీతిని నిరోధించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం అని తెలిపారు.
ఫిజికల్ క్రైమ్ నిరోధించేందుకు ఇప్పటి వరకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు సీఎం. కానీ ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయిందని అన్నారు . సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన సిస్టం ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్ మెంట్, ఇతర అంశాలకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారానికి పోలీసు ఉన్నతాధికారులు కొన్ని ప్రతిపాదనలు అందించారు. వీటిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు. ఆ కమిటీలో విశ్లేషించి సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.





